- అనుమానితుల్లో ఎక్కువ మందికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ
- నిజామాబాద్లో 112 మందికి, నిర్మల్లో 15 మందికి నెగెటివ్
- కేసులు తగ్గుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు
- ‘కంటైన్మెంట్’లో భద్రత కట్టుదిట్టం
- నిర్మల్లో 11 ఏరియాలు..
- ఆదిలాబాద్లోని 19 వార్డుల్లో రహదారుల మూసివేత
మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడగా.. వారి కుటుంబ సభ్యులను, వారితో కాంటాక్ట్ అయిన వారిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అందులో నిన్నటి వరకు పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. శుక్రవారం ఒక్కపాజిటివ్ కేసూ నమోదు కాకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 127మందికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని జిల్లాల్లో అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారులు ఆ జోన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు(ఆరోగ్యజ్యోతి) : కరోనా కట్టడి సత్ఫలితాలిస్తున్నది. అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్లకు తరలించి పరీక్షల కోసం శాంపిళ్లు పంపుతూ వైరస్ నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రైమరీ కాంటాక్ట్స్పై జిల్లా యంత్రాంగం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన మెయిన్ బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యుల (ప్రైమరీ కాంటాక్ట్స్)కు వ్యాధి వచ్చే లక్షణాలు మెండుగా ఉన్న నేపథ్యంలో వీరిని వెంటనే ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించిన విషయం తెలిసిందే. వీరందరి శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం ఎప్పటికప్పుడు హైదరాబాద్కు పంపారు. పాజిటివ్ రాగానే గాంధీ దవాఖానకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర భయాందోళన కలిగిస్తున్న అంశం. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రై మరీ కాంటాక్ట్స్ రిపోర్ట్ పూర్తి సానుకూలంగా రావడం శుభపరిణామం. మొత్తం 112 మంది ప్రైమరీ కాం టాక్ట్స్ రిపోర్టులన్నీ నెగిటివ్గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో 107 మంది ప్రైమరీ కాం టాక్ట్స్ రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. వీటిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. శుక్రవారం వచ్చిన 112 నెగిటివ్ రిపోర్టులలో నగరం నుంచి 60 మంది ఉండ గా.. బాల్కొండ నియోజకవర్గంలో 46, బోధన్లో 13 మంది ఉన్నారు. మరోవైపు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో క్వారంటైన్ క్లస్టర్లను ఏర్పాటు చేసి నిఘాను కట్టుదిట్టం చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 303 మంది వివిధ ప్రభుత్వ క్వారంటైన్లలో ఉండగా.. ఇందులో 112 మందికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. మరో 107 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇంకా 84 మంది శాంపిళ్లు సేకరించి పంపాల్సి ఉంది. నెగె టివ్ వచ్చిన వారిని వారి ఇండ్లకు పంపించి హోం క్వా రంటైన్లో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. వారు ఈ నెల 28వ తేదీ వరకు హోమ్ క్వారంటైన్లోనే ఉంటారని తెలిపారు.
నిర్మల్ జిల్లాలో 15 మందికి నెగెటివ్
నిర్మల్ ప్రధాన ప్రతినిధి/భైంసా, నమస్తే తెలంగాణ/ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో11 కంటైన్ మెంట్ ఏరియాలను గుర్తించారు. పట్టణాల్లో అరకిలోమీటరు, గ్రామాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను దిగ్బంధం చేశారు. వందశాతం శానిటైజేషన్, హోంక్వారంటైన్, రోడ్ల మూసివేత, ఇంటింటి సర్వే చేపట్టారు. పాజిటివ్ కేసులు నమో దైన గ్రామాలను ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటికే 220 మందికి పరీక్షలు చేయగా.. 15 మందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా మరో 106 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపారు. దీంతో 165 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయి. ప్రైమరీ కాంటాక్ట్స్ అంద రి నమూనాలను పంపగా.. వీరందరినీ క్వారంటైన్ చేశా రు. 14 రోజులు క్వారంటైన్ పూర్తయిన వారందరినీ ఇండ్లకు పంపించారు. రెండు రోజుల క్రితం భైంసా పట్టణంలోని కిసాన్గల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు వారి కుటుంబీకులైన 13 మందిని నిర్మల్లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
భైంసాలో తొమ్మిది మంది ఇంటికి..
భైంసా పట్టణంలోని తొమ్మిది మంది కరోనా అనుమానితులను ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని క్వారంటైన్లో ఉంచగా.. శుక్రవారం వారందరికీ నెగెటివ్ రావడంతో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వారిని ఇండ్లకు పంపించారు. ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చిన పది మందికి సైతం నెగెటివ్ వచ్చినట్లు సమాచారం.
క్వారంటైన్లో ఉన్న వారికి నెగెటివ్..
ఖానాపూర్ పట్టణానికి చెందిన ఆరుగురిని 15 రోజు ల క్రితం కరోనా అనుమానంతో నిర్మల్ క్వారంటైన్ కు తరలించారు. వారి రక్త నమూనాలను వైద్య పరీక్షల కోసం గాంధీ వైద్యశాలకు పంపించారు. ఆ ఆరుగురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని పెంబి పీహెచ్సీ హెచ్ఈవో శైలేంద్ర కన్నయ్య తెలిపారు.
ఆదిలాబాద్లో :
ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆరుగురికి పాజిటివ్ రాగా.. 19 వార్డుల్లోని పలు ప్రాంతా లు, నేరడిగొండ, ఉట్నూర్ మండలం హస్నాపూర్ను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతా ల్లో రహదారులను పూర్తిగా మూసివేశారు. వార్డు ల్లో గల్లీ వారియర్స్ను నియమించారు. కూరగాయలు అమ్మే వారిని గుర్తించి ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.