కరీంనగర్: కరీంనగర్లో సంచరించిన ఇండోనేసియా వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు తేలడంతో జిల్లాలో కలవరం పెరుగుతోంది. ఈ నెల 16న 12 మందిని వైద్య పరీక్షలకు హైదరాబాద్ తరలించగా.. బుధవారం మరో 9 మందిని తరలించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనుమానితుల అన్వేషణ దిశగా జిల్లాలోని అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ పట్టణంతోపాటు వారు పర్యటించిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. వారు ఇక్కడ ఉన్న మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో పర్యటించారనే విషయమై ఆరా తీస్తున్నారు. వీరు కలెక్టరేట్ సమీపంలోని ప్రార్థనా మందిరాలకూ వెళ్లారు. 14, 15వ తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వీరు తిరిగారు. వీరు సంచరించిన ప్రాంతాలను తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వీరు సంచరించిన ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేలా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం నుంచి కరీంనగర్ పట్టణంలో 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షల్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీలునిబట్టి ఆయా ప్రాంతాల్ని నిర్బంధం నడుమ ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ బుధవారం రాత్రి కరీంనగర్కు వచ్చి జిల్లా కలెక్టర్ శశాంక, పోలీసు కమిషనర్ కమలాసన్రెడ్డి, వైద్యాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్య తీవ్రతను ప్రజలు గుర్తించాలని, ప్రతి ఒక్కరూ స్వీయజాగ్రత్తలు పాటించాలని కోరారు.