ముంబయి : కరోనా మహమ్మారితో మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 335కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని ధారవి స్లమ్ ఏరియాలో కరోనా వైరస్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆసియాలోనే ఇది అతిపెద్ద స్లమ్ ఏరియా. ధారవిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బుధవారం సాయంత్రం సియాన్ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఈ వ్యక్తి నివాసముంటున్న భవనాన్ని అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ భవనంలో ఉంటున్న మిగతా ఏడు కుటుంబాలను హోం క్వారంటైన్లో ఉంచారు. వీరందరికి ఇవాళ కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.
ఆ స్లమ్ ఏరియాలో ఉంటున్న 10 లక్షల మంది సంగతేంటి?
ధారవి స్లమ్ ఏరియాలో 10 లక్షల మంది ఉంటున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జస్లోక్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.