- ప్రపంచం, దేశంలో పెరుగుతున్న కేసులు
- ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్ కట్టడికి ఆయుధమని అయన పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
.రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని సియం తెలిపారు. చికిత్స పొందుతున్నవారిలో ఏడుగురు కోలుకొని డిశ్చార్జి అయినట్టు చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కి, మరణించినవారి సంఖ్య 16కు, డిశ్చార్జి అయినవారి సంఖ్య 103కు చేరినట్టు వివరించారు. మిగతా 412 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలను గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదని స్పష్టమవుతుంది.
పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయి. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంతవరకు ఇండ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక నిర్ణీత దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ప్రజలు దానికి సహకరించాలి. కరోనా వ్యాప్తి నివారణ అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఆ నిర్ణయాలను ప్రజలు తూచా తప్పకుండా పాటించడం వల్లే సాధ్యమవుతుంది. వైరస్ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందుకంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సీఎం కోరారు.
.