- ఆరెంజ్ జోన్ పరిధిలో కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు
- కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో జాబితా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
కామారెడ్డి / ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెడ్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల పెరుగుదల, తగ్గుదల తీరును అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నవి, క్లస్టర్లలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న వాటిని రెడ్జోన్లో చేర్చారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలు రెడ్జోన్ జాబితాలో ఉన్నాయి. రెడ్జోన్ పరిధిలోని జిల్లాలనే హాట్ స్పాట్లుగానూ కేంద్రం గుర్తించింది. ఆరెంజ్ జోన్ పరిధిలో కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. వీటినే నాన్ హాట్స్పాట్ జిల్లాలుగా నిర్ధారించారు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్జోన్ నుంచి ఆరెంజ్ జోన్కు, ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కు మార్పులు చేపడతారు. ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్ పరిధిలో ఉంది. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కాగా, ఈనెల 4న 10 ‘మర్కజ్’ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలో 6, నేరడిగొండలో 3, ఉట్నూర్ మండలం హస్నాపూర్లో ఒక కేసు నమోదైంది. 7న ఆదిలాబాద్లో మరో ప్రైమరీ కాంటాక్ట్ కేసు పాజిటివ్గా వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన 125 మందిని గుర్తించిన అధికారులు వారిని హోం క్వారంటైన్ చేశారు. జిల్లాలో ఎనిమిది రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమో దు కాలేదు. మరో 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లాను ఆరెంజ్ నుంచి గ్రీన్జోన్కు మార్చే అవకాశాలున్నాయి. రెడ్, ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో ప్రభుత్వం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ను అమలు చేయనుంది.