న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): వ్యక్తిగత ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ క్యాష్ విత్డ్రా అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా గత 10 రోజుల్లో సుమారు 1.37 లక్షల మంది క్లెయిమ్లను పరిష్కరించినట్లు ఈపీఎఫ్వో శుక్రవారం తెలిపింది. 21 రోజుల లాక్డౌన్ అమలు చేస్తుండటంతో ఖాతాదారులకు సహాయం చేయడానికి ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేవైసీ వివరాలు నిబంధనల మేరకు ఉన్న వారి అప్లికేషన్లను 72 గంటల్లోగా ప్రాసెస్ చేస్తున్నామని ఈపీఎఫ్వో సంస్థ తెలిపింది.
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు ఇప్పటి వరకు రూ.279.65 కోట్లు చెల్లించినట్లు ఈపీఎఫ్వో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని ఇప్పటికే విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఖాతాదారులు అవసరమైన మేరకు నగదును విత్డ్రా చేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఈపీఎఫ్ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.